తిరుపతిలో కరోనా డెల్టా ప్లస్ కేసు... ఏపీలో ఇదే మొదటిదన్న మంత్రి ఆళ్ల నాని

  • కొవిడ్ పై సీఎం జగన్ సమీక్ష
  • హాజరైన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని
  • ఇటీవల ఓ వ్యక్తికి డెల్టా ప్లస్ సోకినట్టు వెల్లడి
  • చికిత్స పూర్తయి కోలుకున్నాడని వివరణ
  • అతడి నుంచి ఎవరికీ సోకలేదని స్పష్టీకరణ
ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. నేడు సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్ పై సమీక్ష నిర్వహించగా, మంత్రి ఆళ్ల నాని ఈ అంశం వెల్లడించారు.  డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో ఇదే మొదటిదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఎవరికీ కొవిడ్ వేరియంట్ సోకలేదని తెలిపారు. ఇప్పుడా వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని, కోలుకోవడం కూడా జరిగిందని అన్నారు. తిరుపతి కేసు మినహా ఏపీలో మరెక్కడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు లేవని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

కాగా, యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ గా మార్పు చెందిందని నిపుణులు గుర్తించడం తెలిసిందే. ఇప్పటికే భారత్ లోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికి వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ పలువురు దీని బారినపడ్డారు.

Alla Nani
Corona Virus
Delta Plus Variant
Tirupati
Jagan
Covid Review
Andhra Pradesh

More Telugu News